30-03-2025 12:02:46 AM
విదేశీ విద్యార్థులకు మెయిల్స్ ద్వారా సందేశాలు..
హెచ్చరికలు జారీ చేసిన విదేశాంగ శాఖ..
వాషింగ్టన్: అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన విద్యార్థులు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్ పంపినట్టు సమాచారం. కేవలం ఆందోళనల్లో పాల్గొన్నవారికే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన విద్యార్థులకు కూడా హెచ్చరిక సందేశాలు పంపినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో కొందరు భారతీయ విద్యార్థులు సైతం ఉండే అవకాశముంది.
అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో అక్కడి విద్యార్థులు ఆన్లైన్లో యాక్టివ్గా ఉండడం వల్ల కలిగే పరిణామాలు, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిమితులపై ఆందోళన రేకెత్తుతోంది. జాతి వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న వారి సోషల్ మీడియా ఖాతాలను అమెరికా విదేశాంగశాఖ జల్లెడ పడుతోంది. ఒకవేళ అదే నిజమని తేలితే ఆ విద్యార్థులకు అమెరికాలో చదువుకునే వీల్లేకుండా తక్షణమే స్వదేశానికి పంపించే యోచనలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ, కాన్సులేట్ అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.