23-03-2025 10:19:54 PM
భూమి లేని వారికి పాసు పుస్తకాలను కట్టబెట్టిన రెవెన్యూ అధికారులు..
రుణాలు పొంది చేతులెత్తే స్తున్న నకిలీ రైతులు..
ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందిన వైనం..
ఇలాంటి ఘటనలు జిల్లాలో మరెన్నో..?
కామారెడ్డి (విజయక్రాంతి): భూమి లేకుండా నకిలీ పాసు పుస్తకాలు పొంది బ్యాంకులో నుంచి రుణాలు పొందిన నకిలీ రైతుల బాగోతం ఇది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో 273 ఎకరాలకు రెవెన్యూ అధికారులు నకిలీ పుస్తకాలు జారీ చేశారు. ఈ నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో ధరణిలో మార్చుకొని ప్రభుత్వం నుంచి వచ్చే రైతుబంధు, సంక్షేమ పథకాలు రుణాలు గత ప్రభుత్వా హాయంలో మింగేశారు. ఈ నకిలీ పుస్తకాల కుంభకోణంలో జుక్కల్ తాసిల్దార్ కార్యాలయంలో పనిచేసే రెవిన్ ఇన్స్పెక్టర్, సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్ గతంలో పనిచేసిన తాసిల్దార్ సహకారంతో పెద్ద ఎత్తున భూములను లేకున్నా ఉన్నట్లు డబ్బులు తీసుకుని జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జుక్కల్ మండల కేంద్రంలోని బీరప్ప మందిర్ వద్ద 321 సర్వేనెంబర్, రుద్రపహాడ్ నాలుగో సర్వే నెంబరులో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి. ఎవరెవరు పేరు మీద ఉన్నాయి. ఏఏ సర్వేనెంబర్ భూములకు నకిలీ పట్టా పాస్ పుస్తకాలు జారీచేశారో అన్నదానిపై విచారణ జరిగితే అవినీతి అక్రమార్కులు చిక్కే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని అక్రమ నకిలీ పాస్ పుస్తకాల బాగోతంపై విచారణ చేపట్టాలని జుక్కల్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలలో సైతం నకిలీ పాస్ పుస్తకాల ద్వారా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందిన బాగోతాలు ఉన్నాయి. ప్రభుత్వం రుణమాఫీ చేసిన వారిలో ఈ ఆక్రమ నకిలీ పాసు పుస్తకాల రైతులు కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.