13-02-2025 04:27:49 PM
బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిళ్ల శ్రీనివాస్..
మందమర్రి (విజయక్రాంతి): బీసీలను అవమాన పరిచేలా మాల సంఘం నాయకులు పైడిమల్ల నర్సింగ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేమెంతో-మాకంతా అనే నినాదంతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గత రెండు దశాబ్దాలుగా బిసిల హక్కుల కోసం పోరాటం చేపట్టి బీసీలను చైతన్యవంతులను చేశారని అన్నారు. బీసీల ఐక్యతను గుర్తించిన అన్ని రాజకీయ పార్టీలు బీసీ నినాదంతో ముందుకు వెళ్తుంటే, మాల సంఘం నాయకులు బహుజనుల ఐక్యతకు భంగం కలిగించే విధంగా మాట్లాడటమే కాకుండా, బీసీలలో ఐక్యత లేదనీ, రాజకీయం తెలియదని అగౌరవ పరచటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
బీసీలను అగౌరవ పరచటం మాల సంఘం వైఖరా లేదంటే మీ సొంత వైఖరా స్పష్టంగా చెప్పాలనీ ఆయన డిమాండ్ చేశారు. బీసీల రాజకీయ చైతన్యం గుర్తించి నేడు కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడికి తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిందని, బిజెపి పార్టీ కేంద్ర మంత్రిగా రాష్ట్రం నుంచి బీసీ నాయకుడికి అవకాశం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. బహుజన కులాలు ఏకమై బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బహుజనుల ఐక్యతను విచ్చిన్నం చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా మాల సంఘం నాయకులు తమ వైఖరి మార్చుకుని బహుజన కులాల పట్ల అనుచిత వాఖ్యలు మానుకోని బీసీలకు క్షమాపణ చెప్పాలని లేకుంటే ఆందోళనలు చేపడతామన్నారు.