18-02-2025 01:28:14 AM
రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్
యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ఈ నెల 19 నుండి 23 వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవములను అత్యంత వైభవంగా నిర్వహించాలని, పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతూ పర్యవేక్షణ చేపట్టాలని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం యాదగిరిగుట్ట దేవస్థాన కార్యాలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ హనుమంత రావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆలయ ఈ. ఓ భాస్కరరావు, ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమీషనర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు నిర్వహించే స్వామివారి బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు కేటాయించిన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.వి ఐ పి లను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రతి రోజు వివిధ ప్రాంతాల నుండి దేవాలయానికి ఎక్కువ మంది భక్తులు వస్తారని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లను చేయాలని అధికారులకు ఆదేశించారు.భద్రత ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన సౌకర్యాలను పర్యవేక్షిస్తూ, ప్రోటోకాల్ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాలని,
ఆలయం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, క్యూలైన్లను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఆలయ పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్, తాగునీటి సదుపాయాలు,మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు.పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన బందోబస్తు ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా,పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. ఎమర్జెన్సీ సేవలను అందుబాటులో ఉంచాలని, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు.
సూదుర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ వారు అదనపు బస్సులు నడపడంతో పాటు,రోడ్లపై పార్కింగ్ చేయకుండా చూడాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అన్నారు .
ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు జరిగే మహోత్సవాన్ని భక్తుల భాగస్వామ్యంతో గొప్పగా నిర్వహించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పిసిఈ ఓ శోభారాణి, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి , ఏ సి పి రమేష్,మండల తహసీల్దార్ లు , ఎంపీడీవో లు , మున్సిపల్ కమిషనర్లు , సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.