బాంబే హైకోర్టు కీలక తీర్పు
ముంబై, సెప్టెంబర్ 20: దేశంలో నకిలీ వార్తలను నియంత్రించేందుకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు (ఎఫ్సీయూ) ఏర్పాటు చేసేందుకు వీలుగా గతేడాది కేంద్రం ఐటీ రూల్స్ లో చేసిన సవరణలను బాంబే హైకోర్టు కొట్టివేసింది. కేంద్ర సవరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19కి విరుద్ధమని శుక్రవా రం జస్టిస్ ఏఎస్ చందుర్కర్ తీర్పు చెప్పారు. రూల్స్ సవరణను సవాల్చేస్తూ ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్ ను విచారించిన డివిజన్ బెంచ్ పరస్పర విరుద్ధమైన తీర్పు ఇవ్వటంతో కేసు మూడో జడ్జీ వరకు వెళ్లింది. బెంచ్లోని జస్టిస్ గౌతం పటేల్ కొత్త ఐటీ రూల్స్ను రద్దుచేస్తూ తీర్పునిచ్చారు. మరో న్యాయమూర్తి నీలా గోఖలే వాటిని సమర్ధించారు. దీంతో పిటిషన్ చందుర్కర్ వద్దకు వెళ్లింది. ఎఫ్సీయూల ఏర్పాటును గత మార్చిలోనే సుప్రీంకోర్టు నిలిపేసింది. బాంబే హైకోర్టులో విచారణలో ఉన్న కేసులో తీర్పు వచ్చేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. ఐటీ రూల్స్ సవరణను రద్దుచేస్తూ కోర్టు తీర్పు వెలువడింది.