- గణేష్ ఉత్సవాలు గుర్తుండిపోయేలా చేయాలి
- అనుమతులు తీసుకున్న మండపాలకు ఉచిత విద్యుత్
- అధికారులు, నిర్వాహకులు సమన్వయంతో సాగాలి
- ఉత్సవాల నిర్వహణపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
- భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు హర్షం
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం తొలి నుంచి మత సామరస్యానికి, ప్రశాంతతకు పేరు పొందిందని, ఆ పేరును మరింత పెంచేలా గణేష్ ఉత్సవాల నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకోసం ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహ కులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై రాష్ర్ట సచివాలయం లో రేవంత్రెడ్డి గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మండపాల ఏర్పాటు, తొమ్మిది రోజు ల ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనానికి మండ ప నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించటం ముఖ్యం’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖతో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులు సైతం మండప నిర్వాహకులతో సమ న్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ఎక్కడ ఎటువంటి లోటుపాట్లకు తావివ్వరాదని హెచ్చరించారు. జోన్ల వారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించాలని, ఉత్సవ కమిటీ సభ్యులు, మండప నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ శాంతియుతంగా ఉత్సవాలు, నిమజ్జనం కొనసాగేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని రేవంత్రెడ్డి ఆదేశించారు. ఏ అధికారి ఏ జోన్లో బాధ్యతల్లో ఉన్నారు.. ఆయా ప్రాంతాల్లో ఉత్సవ కమిటీ ప్రముఖులు, మండపాల బాధ్యుల వివరాలు సమగ్రంగా ఉండాలని సూచించారు.
అనుమతులు తీసుకోవాలి
అవుటర్ రింగు రోడ్డు పరిధిలో గతేడాది 1.50 లక్షల గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారనే లెక్కలున్నాయని సీఎం తెలిపారు. ముందుగా మండప నిర్వాహకులు ఆన్లైన్లోనో, ఆఫ్లైన్లోనో అనుమతులు తీసుకో వాలని, అలా తీసుకోవడం వలన ఆయా ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ ఇతర ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. మొత్తం విగ్రహాలను హుస్సేన్ సాగర్కే కాకుండా ఇతర చెరువుల్లోనూ నిమజ్జనం చేసే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.
సరూర్నగర్తో పాటు పలు చెరువులు నీటితో ఉన్నా యని, ఏ ప్రాంతంలోని విగ్రహాలు ఆ ప్రాంతంలోని చెరువుల్లో నిమజ్జనం చేస్తే హుస్సేన్సాగర్ వద్ద రద్దీ తగ్గడంతో పాటు ఆయా చెరువుల వద్ద నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ముందుగానే చేసే వీలుంటుందని అన్నారు. ఈ విషయం లో ఉత్సవ సమితి సభ్యులు, మండప నిర్వాహకులు ముందగానే సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.
కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు
నిమజ్జనానికి ముఖ్య అతిథులుగా ఎవరినైనా పిలిస్తే ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని, వీవీఐపీలు ఎవరైనా వచ్చే అవకాశం ఉంటే ముందుగా తెలియజేస్తే పోలీసు శాఖ వారి రాకపోకలకు రూట్ క్లియర్ చేయడంతో పాటు తగిన భద్రత ఏర్పాటు చేస్తుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. నిమజ్జన ఊరేగింపు త్వరగా ప్రారంభిస్తే త్వరగా కార్యక్రమాన్ని ముగించుకోవచ్చని, ఫలితంగా భక్తులు ట్రాఫిక్, ఇతర ఇబ్బందులు బారిన పడకుండా చూసుకోవచ్చని అన్నారు.
ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నగరం పరిధిలోని నలుగురు లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని పోలీసులను ఆదే శించారు. సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబి, 17న తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు పలు కార్యక్రమాలు చేపడతాయని, అందువలన అన్ని కార్యక్రమాలకు సక్రమ ప్రణా ళికతో ముందుకు సాగాలని ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని పోలీసులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
మండపాలకు ఉచిత విద్యుత్
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ముందుగా మండప నిర్వాహకులు ఉచిత విద్యుత్ సరఫరాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుం డా విద్యుత్ వినియోగిస్తే చట్టప్రకారం చర్య లు తీసుకుంటామని, జవాబుదారీతనం కోసమే అనుమతి చేసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. నిమజ్జనం రోజైన సెప్టెం బర్ 17వ తేదీన అనంత చతుర్దశి వచ్చిందని, ఆ తేదీ ప్రాముఖ్యతను తెలుపుతూ దేవాదాయ శాఖ తరఫున పర్వదిన ప్రాము ఖ్యతను తెలిపే సాహిత్యాన్ని ప్రచురించాలని, ప్రచారం చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జీ రాఘవరెడ్డి సీఎంకు విజ్ఞప్తి చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావును ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు ప్రతిష్టించండి
మండపాల్లో డీజేలు వాడేందుకు అనుమతి ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ముందుకు వెళతామని సీఎం తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పర్యావరణ హిత (ఎకో ఫ్రెండ్లీ) విగ్రహాలు ప్రతిష్టించాలని మంత్రి శ్రీధర్బాబు సూచించారు. గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటివరకు నిర్వహించిన సమావేశాలు, ఉత్సవ సమితి సభ్యులు చేసిన సూచనలు, పరిష్కరించిన సమస్యల వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. మొత్తంగా 25 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ జితేందర్, హైదరాబాద్ సిటీ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
అన్ని శాఖలతోనూ సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. ఉత్సవాల్లో మట్టి విగ్రహాలు వాడేలా చూడాలని, మద్యం తాగి ఇబ్బంది పెట్టే వారి విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి కోరారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై స్వయంగా సీఎం సమీక్షించడంపై ఉత్సవ కమిటీ సభ్యు లు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రులు సమీక్షించేవారని, గత పదేళ్లుగా ఈ సమావేశాలకు సీఎం రాలేదని గుర్తుచేశారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సీఎస్ శాంతికుమారి, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 19న మిలాద్
మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనలను సెప్టెంబర్ 19న నిర్వహించుకునేందుకు మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 16న మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని మిలాద్ కమిటీ నిర్ణయించింది. మిలాద్ ఉన్ నబీ ఏర్పట్లపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం రాత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 7 నుంచి గణేష్ నవరాత్రోత్సవాలు, 17న గణేష్ నిమజ్జనం ఉన్న విషయం చర్చకు వచ్చింది. దీంతో మిలాద్ ఉన్ నబీ ప్రదర్శనలను వాయిదా వేసుకునే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం, మంత్రులు మిలాద్ కమిటీ సభ్యులకు సూచించారు.
ఈ అంశంపై చర్చించే బాధ్యతలను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, మిలాద్ కమిటీ సభ్యులకు అప్పగించారు. సమీక్ష అనంతరం వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రదర్శన వాయిదా వేయాలని ప్రభుత్వ ప్రతినిధులు కోరగా మిలాద్ కమిటీ సభ్యులు సానుకూలత వ్యక్తంచేశారు. మహ్మద్ ప్రవక్త 1499 జన్మదినం సెప్టెంబర్ 16న జరుగుతుందని, వచ్చే ఏడాది 1500 జన్మదినం కనుక ఏడాదిపాటు ఉత్సవాల నిర్వహణకు అనుమతించాలని సీఎంను మిలాద్ ఉన్ నబీ ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు.
నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తామని సీఎం తెలిపారు. మసీదుల అలంకరణ, వివిధ జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలకు అనుమతులు ఇవ్వాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఒక జాబితా తయారుచేసి ఇవ్వాలని కమిటీ సభ్యులకు సీఎం సూచించారు. వాటిని పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.