న్యూఢిల్లీ, అక్టోబర్ : దక్షిణ కొరియా ఆటో దిగ్గజం భారతీయ సబ్సిడరీ హ్యుందా య్ మోటార్ ఇండియా జారీచేయనున్న ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లో ఒక్కో షేరుకు రూ.1,865-1,960 చొప్పున (22 డాలర్లు) ప్రైస్బ్యాండ్గా నిర్ణయించారు. హ్యుందాయ్ ఇండియాకు 19 బిలియన్ డాలర్ల విలువను ఆపాదిస్తూ ఐపీవో ధరను ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
రూ.25,000 కోట్ల (దాదాపు 3 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను పబ్లిక్ ఆఫర్లో జారీచేస్తుంది. సంస్థాగత ఇన్వెస్టర్ల బిడ్డింగ్తో అక్టోబర్ 14న ఐపీవో ప్రారంభమవుతుంది. రిటైల్, ఇతర విభాగాల్లో బిడ్స్ను అక్టోబర్ 15 నుంచి 17 వరకూ ఆహ్వానిస్తారని ఆ వర్గాలు వివరించాయి.
అతిపెద్ద పబ్లిక్ ఆఫర్
రూ.25,000 కోట్ల సమీకరణతో ఇండియాలో ఇప్పటివరకూ వచ్చిన పబ్లిక్ ఆఫర్లు అన్నింటికంటే హ్యుందాయ్ ఐపీవో అతిపెద్దదిగా నిలుస్తుంది. రెండేండ్ల క్రితం లైఫ్ ఇన్సూరెన్స్ జారీచేసిన రూ. 21,000 కోట్ల ఇష్యూను మించుతుంది. సెబీకి సమర్పించిన ప్రాస్పెక్టస్ ప్రకారం ప్రమోటింగ్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన సబ్సిడరీలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూట్లో 14.22 కోట్ల షేర్లను విక్రయిస్తుంది.
ఎటువంటి తాజా ఈక్విటీ షేర్లనూ జారీచేయదు. భారత్ మార్కెట్లో ఆటోమొబైల్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ వచ్చి రెండు దశాబ్దాలు గడించింది. 2003వ సంవత్సరంలో మారుతి ఐపీవో తర్వాత ఆటోమొబైల్ ఐపీవో హ్యుందాయ్దే అవుతుంది.