నగదు, బంగారం అపహరణ
ఎల్బీనగర్, జూలై 10: నాగోల్ డివిజన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో మంగళవారం రాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన ఆకునూరి సుదర్శన్ భార్యాపిల్లలతో కలిసి వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల కుంట్లూర్ శివారులో కొంతమంది పేదలు ఇంటి స్థలం కోసం గుడిసెలు వేసుకున్నారు. రాత్రివేళ గుడిసెలు వేసుకున్నవారు కాపలాగా వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడ గుడిసె వేసుకున్న సుదర్శన్ సైతం మంగళవారం భార్యతో వెళ్లి కాపలా ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున వైఎస్ఆర్ కాలనీలోని అద్దెకు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులకొట్టి ఉన్నది. లోపలికి వెళ్లి చూడగా రూ.3.10 లక్షల నగదుతో పాటు ఐదు తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.