‘ఏడు చేపల కథ’ ఫేమ్ అభిషేక్ పచ్చిపాల హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జస్ట్ ఎ మినిట్’. ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీలో నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ కథానాయికలు. యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. తన్వీర్, ప్రకాశ్ నిర్మాతలు కాగా, ఈ మూవీని ఇదే నెల 19వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. కాగా, మేకర్స్ శనివారం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో హీరో అభిషేక్ మాట్లాడుతూ చిత్రీకరణ సమయంలో చోటుచేసుకున్న కొన్ని సరదా సంఘటనలు ఈ వేదికపై పంచుకొని నవ్వులు పూయించారు. నటుడు జబర్దస్త్ ఫణి మాట్లాడుతూ.. ‘ఈ నెల 19 నుంచి థియేటర్లలో వినోదం ఉండబోతోంది’ అని చెప్పారు. ఇంకా ఈ ఈవెంట్లో చిత్ర నిర్మాతలు, దర్శకుడు, హీరోయిన్లతోపాటు నటుడు సారిపల్లి సతీశ్, సినిమాటోగ్రాఫర్ అమీర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్కే బాజీ తదితరులు మాట్లాడారు.