calender_icon.png 19 September, 2024 | 10:25 PM

గ్రీన్ ఎనర్జీకి గుండెకాయ

17-09-2024 02:09:09 AM

  1. తెలంగాణలో ఏటా ౩౦౦ రోజులు సూర్యరశ్మి 
  2. సౌర విద్యుత్తు ఉత్పత్తికి అపార అవకాశాలు 
  3. దేశ లక్ష్యాన్ని తెలంగాణ ముందుకు తీసుకెళ్లగలదు 
  4. 2035 నాటికి 40 వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం 
  5. పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సమ్మిట్‌లో పారిశ్రామికవేత్తలకు డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు 

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): స్థిరమైన, విశ్వసనీయమైన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం సమగ్ర పాలసీని అభివృద్ధి చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రారంభమైన 4వ ప్రపంచ పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి పెట్టుబడిదారుల సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున భట్టి పాల్గొన్నారు. రాష్ర్టంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వివరించారు.

రాబోయే ఐదేళ్లలో తెలంగాణ ఉత్పత్తి చేయనున్న 20 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రణాళికను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ పవర్ మిషన్ లక్ష్యం సాధించడానికి వివిధ రంగాల్లోని పెట్టుబడిదారులు తమతో చేతులు కలపాలని ఆహ్వానించారు. గ్రీన్ ఎనర్జీతో భవిష్యత్తును మరింత  బలంగా నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.

కేంద్ర లక్ష్య సాధనలో అగ్రభాగాన నిలబడుతాం

2035 నాటికి 40 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక, సామాజిక శ్రేయస్సుకు రిలయబుల్ ఎనర్జీ పునాది లాంటిదని పేర్కొన్నారు. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నదని, ఆ లక్ష్యాన్ని సాధించడంలో తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుందని తెలిపారు. ఐటీ, ఫార్మాస్యూటికల్స్ తయారీ వంటి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలతో దూసుకుపోతున్న తెలంగాణ.. కేంద్రప్రభుత్వ లక్ష్య సాధనకు నాయకత్వం వహించాలని భావిస్తోందని చెప్పారు.

రాష్ర్టంలో రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని రాష్ర్ట ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని వెల్లడించారు. ఇంటెలి జెన్స్ సిటీ, ఫ్యూచర్ సిటీ చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమై ఉందని, కీలక పారిశ్రామిక కారిడార్లను అనుసంధానం చేయడానికి ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మిస్తున్నట్టు వివరించారు. ఇవి పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం కల్పిస్తాయని భట్టి తెలిపారు. తెలంగాణలో సమృద్ధిగా ఉన్న వనరులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, టీఎస్ వంటి వ్యాపార అనుకూల సంస్థలు గ్రీన్ ఎనర్జీ రంగాల్లో కంపెనీలు అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాలను కల్పిస్తున్నాయని వివరించారు.

పెట్టుబడిదారులతో హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం

ప్రపంచ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడిదారుల సమ్మిట్ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి 40 మందికిపైగా సౌర విద్యుత్ రంగ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో గీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివరించా రు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందు కు పలు సంస్థలు ఆసక్తి చూపిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని, ఇందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ను కలిసినవారిలో జర్మనీ జీఐజెడ్, టాటా పవర్, సెంకార్బ్, రెన్యూ పవర్ ఇండియన్ ఆయిల్, ఐఐటీ బాంబే, హీరో పవర్, ఓర్జా ఎనర్జీ, ఓనిక్స్, ఎన్‌హెచ్‌పీసీ వంటి దిగ్గజ కంపెనీల ఎండీలు, సీఈఓలు, చైర్మన్లు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ డైరెక్టర్లు ఉన్నారు. 

పెట్టుబడులతో హైదరాబాద్‌కు రండి

తెలంగాణలో ఏడాదిలో ౩00 రోజులకుపైగా సమృద్ధిగా ఉండే సూర్యరశ్మితో సుమారుగా 26.4 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డిప్యూ టీ సీఎం చెప్పారు.  దేశంలో బలం గా గాలులు వీచే మొదటి ఎనిమిది రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ ఉంద ని, పవన విద్యుత్ ఉత్పతిలో తమ ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకున్నదని వివరించారు. రాష్ర్టంలో  శ్రీశై లం, నాగార్జునసాగర్‌లో రెండు హై డ్రో ప్రాజెక్టులు ఉన్నాయని, ఇక్కడ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టడానికి ఇంకా అవకాశాలు ఉన్నా యని వెల్లడించారు. వీటితోపాటు రిజర్వాయర్లు, పాడుబడిన గనులు మొదలైన వాటిని ఉపయోగించి నదిలోపలితో పాటు, వెలుపల పంపుడ్ స్టోరేజీ ప్రాజెక్టులను చేపట్టడానికి మరింత అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

సోలార్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే వారంతా హైదరాబాద్‌కు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలి పారు. సమావేశంలో ప్రధాని మో దీ, ఏపీ, మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు చంద్రబా బు నాయుడు, ఏక్‌నాథ్ షిండే, విష్ణుదేవ్ శాయ్, భజన్ లాల్ శర్మతో పాటు కేంద్ర మంత్రులు, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ముషారఫ్, వరుణ్ రెడ్డి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.