26-04-2025 12:16:23 AM
సూర్యాపేట, ఏప్రిల్25(విజయక్రాంతి): జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు పట్టించుకోకున్నా... తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బందం జిల్లాలో నకిలీ డాక్టర్ల వ్యావహారం తమ తనిఖీలతో వెలుగులోకి తీసుకొస్తున్నది. జిల్లా కేంద్రంలో నకిలీ డాక్టర్లతో హాస్పటళ్లను పుట్టగొడుగుల్లా ఏర్పాటు చేస్తున్నారని గత ఏడాది నవంబర్లోజిల్లాలో హాస్పటల్ ల తీరుపై ‘అద్దెకు డాక్టర్ సర్టిఫికెట్’ శీర్షికన విజయక్రాంతి కథనాన్ని ప్రచూరించింది.
కాగా గత వారం క్రితం రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బందం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించి ల్యాబ్ టెక్నీషియనే డాక్టర్ గా చలామణి అవుతున్న బాగోతం గుట్టురట్టు చేశారు. ఈ నేపధ్యంలో ఈ నెల 17 మరో సారి జిల్లా నకిలీ డాక్టర్ల తీరును వివరిస్తూ ‘నకిలీ డాక్టర్లపై చర్యలుంటాయా...?’ అనే కథనాన్ని విజయక్రాంతి ప్రచూరించింది.
ఈ కథనానికి సంబంధిత శాఖ జిల్లా అధికారులు స్పదించలేదు. కానీ మరో సారి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్పందించింది. తాజాగా గురువారం నిర్వహించిన తనిఖీల్లోనూ నలుగురు డాక్టర్ల వ్యవహారం బట్టబయలైంది.
అర్హత లేకుండానే వైద్యం
అర్హత లేకున్నా నకిలీ సర్టిఫికెట్ తో 13 ఏళ్లుగా నిర్వ హిస్తున్న స్కానింగ్ సెంటర్ బాగోతం అధికారుల తనిఖీల్లో బయటపడింది. జిల్లా కేంద్రంలో ఆపిల్ స్కాన్ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్ ఇన్నాళ్లూ ఎండీ రేడియాలజిస్టుగా చలామణి అవుతూ వచ్చారు. తనిఖీల్లో కేవలం ఎంబీబీఎస్ మాత్రమే పూర్తి చేసినట్లు సర్టిఫికెట్స్ బయటపడ్డాయి. ఎంబీబీఎస్ ఎం.డీ. రేడియాల జిస్ట్ గా నకిలీ సర్టిఫికెట్ సృష్టించినట్లు అధికారులు దృవీకరించారు.
ఇదే స్కానింగ్ సెంటర్ లో పని చేస్తున్న మరో రేడియాలజిస్ట్ అలీ ఖాన్ ఎంబీబీఎస్ పూర్తిచేసి ఎం.డీ.గా చెప్పు కుంటూ వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే సదరు డాక్టర్ ఎంబీబీఎస్ ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది. తెలంగాణ రిజిస్ట్రేషన్ లేకుండానే ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. శరత్ కార్డియాక్ కేర్ ఆసుపత్రిలో డాక్టర్ శిరీష పేరిట అనుమతి తీసుకుని అసలు డాక్టరే లేకుండా ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియనే వైద్యం అందిస్తున్నట్లు గుర్తిం చారు.
శ్రీ కృష్ణ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ రవి శేఖర్ అనస్తీషియా ఆర్హత ఉండగా జనరల్ ఫిజీషియన్ గా అవతారం ఎత్తి ఏకంగా సర్జరీలు చేస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. అంతేకాకుండా హాస్పిటల్ లో ఎలాంటి పర్మిషన్ లేకుండా అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ నిర్వహిస్తుండగా అందులో పని చేస్తున్న రేడియాలజిస్ట్ సైతం ఏపీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఉండడం కొసమెరుపు.
సాయి గణేష్ హాస్పిటల్ నడిపిస్తున్న డాక్టర్ సందీప్ కుమార్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి 2019 నుంచి సూర్యాపేటలో ఎం.డీ.గా చలామణి అవుతున్నారు. అయితే రెండేళ్ల క్రితం చైనా ఎంబీబీఎస్ సర్టిఫికెట్ గడువు ముగిసినా.. రెన్యువల్ చేయకుండా నిర్లక్ష్యంగా హాస్పిటల్ నిర్వహిస్తున్నారు.
తనిఖీల సమయంలో రెండేళ్ల నుంచి ప్రాక్టీస్ చేయడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినా.. మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఔట్ పేషెంట్ షీట్ లను పరిశీలించి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న పేషెంట్లకు ఫోన్ చేసి మాట్లాడి సదరు డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారని నిర్ధారించారు.
వైద్యారోగ్యశాఖకు పట్టింపేది...
జిల్లా కేంద్రంలో మరి కొంత మంది ఫేక్ డాక్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అ విషయం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు దృవీకరిస్తున్నారు. కొందరు అర్హత లేని వారు కూడా వేరే వ్యక్తి ఫార్మసీ సర్టిఫికెట్, డాక్టర్ల సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుంటూ వారికి నెలనెలా జీతం చెల్లిస్తూ అసుపత్రులను నిర్వహిస్తున్నారు.
కమీషన్ల ఎర చూపి జిల్లాలోని ఆర్ఎంపీలను తమ వైపు తిప్పు కొని రోగులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ దందా వెనుకా ఆ శాఖ అధికారుల హస్తం సహితం ఉందని, లేకుంటే ఏలాంటి దృవపత్రాలు చూడకుండా అనుమతులు ఏలా ఇస్తారని ప్రజలు ఆరోపిస్తున్నారు.