ఆమె పేరిటే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు
అక్టోబర్ 3 నుంచి పైలట్గా క్షేత్రస్థాయిలో పరిశీలన
ఒక్కో నియోజకవర్గంలో రెండు ప్రాంతాల ఎంపిక
సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కుటుంబ డిజిటల్ కార్డుల్లో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనక ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల (ఎఫ్డీసీ)కు సంబంధించి సచివాలయంలో ముఖ్యమంత్రి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రల్లో పర్యటించిన అధికారులు.. వారు చేసిన అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాల నుంచి సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను వివరించారు. అనంతరం ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై సీఎం అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
పాన్ కార్డు, బ్యాంకు ఖాతాల సమాచారం అవసరం లేదు
ప్రస్తుతం ఉన్న రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్దారణ చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలని, లోపాలను పరిహరించాలని చెప్పారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
నియోజకవర్గానికి రెండు ప్రాంతాలు
ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సమాచార సేకరణ, వాటిలో ఏమేం పొందుపర్చాలి, అప్డేట్కు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దామోదర రాజనర్సింహతో కూడిన మంత్రివర్గ ఉప సంఘానికి అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
మంత్రివర్గ ఉప సంఘం సూచనల మేరకు అందులో జత చేయాల్సిన, తొలగించాల్సిన అంశాలను సమగ్ర జాబితా రూపొందించాలని సూచించారు. అనంతరం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని పేర్కొన్నారు. ఇందులో పూర్తిగా గ్రామీణ ప్రాంతాలున్న నియోజకవర్గాల్లో రెండు గ్రామాలు, పూర్తిగా పట్టణ/నగర ప్రాంతాలు ఉన్న నియోజకవర్గాల్లో రెండు వార్డులు/డివిజన్లను ఎంపిక చేస్తారు.
అక్టోబర్ 3 నుంచి డోర్ టు డోర్ పరిశీలన
కుటుంబాల నిర్దారణ, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వివరాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డాటా ఆధారంగా అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు.
పైలట్ ప్రాజెక్టును పకడ్బందీగా చేపట్టాలని, ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి అధికారిని, పట్టణ/నగర ప్రాంతాల్లో జోనల్ కమిషన్ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించాలని చెప్పారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇటీవల వరదల సమయంలో వేసిన సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
క్షేత్రస్థాయి పరిశీలన సమగ్రంగా, కచ్చితత్వంతో చేపట్టాలని, ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా చూడాలని సీఎం స్పష్టంచేశారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి వీ శేషాద్రి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శులు అజిత్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, కార్యదర్శులు సంగీత సత్యనారాయణ, మానిక్రాజ్, షానవాజ్ ఖాసీం, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.