22-04-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర,ఏప్రిల్21(విజయక్రాంతి): గూడు లేని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసమే ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో లబ్ధిదారులు అవుదుర్తి కళాకిషన్, అవుదుర్తి కళ్యాణిఎల్లయ్య, బాలగోని భాగ్యగంగయ్య, కనుకుంట్ల మహితరాజశేఖర్, గూడేపు లక్ష్మి రాజయ్య, తీగల మాధవిరాజశేఖర్, ఎలగందుల భాగ్య లు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను సోమవారం కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా గంగాధర మండలం కురిక్యాల గ్రామాన్ని ఎంపిక చేసినట్లు, గ్రామంలో అర్హులైన వారికి 100% ఇండ్లను అందజేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత ఆర్థిక సహాయం లక్ష రూపాయలు ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, ఎంపీడీవో రాము , పంచాయతీ కార్యదర్శి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.