21-04-2025 01:05:20 AM
ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి): రైతు మేలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని , రైతు కళ్ళల్లో ఆనందం నింపేందుకే సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ప్రకటించడం జరిగిందని, ఈ యాసంగిలో కూడా బోనస్ చెల్లించడం జరుగుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరువాలం కష్టపడి పండించిన పంటను గత ప్రభుత్వంలో వివిధ రకాల కోతల పేరుతో ధాన్యాన్ని దండుకొని రైతులకు అనేక విధాలుగా దోచుకున్న సంఘటనలు జరిగాయని, ఇప్పుడు తమ ప్రభుత్వం అందుకు పూర్తిగా భిన్నంగా, పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేస్తుందని చెప్పారు.
అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట ఉత్పత్తులను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే అన్నారు.