calender_icon.png 19 March, 2025 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ కవిత పోరాటంతోనే రెండు వేరువేరు బిల్లులు పెట్టిన ప్రభుత్వం

18-03-2025 06:22:18 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాట ఫలితంగానే బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచడానికి రెండు వేరువేరు బిల్లులను పెట్టిందని జాగృతి నాయకులు ఈట రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు బెల్లంపల్లిలో విలేకరులతో మాట్లాడారు. బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గిందని అన్నారు. అందుకు గాను ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. ఇది తెలంగాణ జాగృతి సాధించిన మరో భారీ విజయంగా వారు అభివర్ణించారు.

సుదీర్ఘకాలంగా ఈ దేశంలో అన్ని రకాల అన్యాయాలకు గురైన బీసీ సోదరులకు రిజర్వేషన్ల కోసం విద్యా, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేర్వేరు బిల్లులను ప్రవేశ పెట్టడం స్వాగతిస్తున్నామని తెలిపారు. విద్యా ఉపాధి రాజకీయ రిజర్వేషన్లకు కలిపి ఒకే బిల్లు పెడితే బీసీలకు అన్యాయం జరుగుతుందని ముందే గుర్తించి వేరువేరు బిల్లులు పెట్టాల్సిందే అని పెద్ద ఎత్తున డిమాండ్ చేసింది కేవలం జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాత్రమే అని గుర్తు చేశారు. మండల్ కమిషన్ రిపోర్టును తొక్కి పెట్టింది మొదలు కులగణనన విషయంలో కూడ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీసీలకు అన్యాయం చెయ్యాలని చూశాయని ఆరోపించారు.

బీసీ సంఘాల, తెలంగాణ జాగృతి వంటి సంస్థల ఒత్తిడి, కొనసాగించిన ఉద్యమంతోనే బీసీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయన్నారు. బీసీల కోసం బీసీలు మాత్రమే మాట్లాడాలనే కొందరి వాదన బీసీల గొంతును బలహీనపరచాలనే కుట్ర మాత్రమే అని ఆయన అన్నారు. బాధితుల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన జాగృతి నిరంతర పోరాటం చేస్తుందని అన్నారు. సంపూర్ణంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు తెలంగాణ జాగృతి బీసీలకు అండదండగా ఉంటుందని తెలిపారు. బిల్లులు పాస్ అవుతున్న ఈ కీలక దశలో కేంద్రం మీద ఒత్తిడి పెంచేందుకు బీసీలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం రెండు వేరువేరు బిల్లులు పెట్టడం ఎమ్మెల్సీ కవిత సాధించిన విజయమని మరోసారి గుర్తు చేశారు.

తెలంగాణ జాగృతి చేసిన సుదీర్ఘ పోరాటంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. బిల్లు ప్రవేశపెట్టి చేతులు దులుపుకోకుండా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలయ్యే వరకు బిసి సోదరుల పక్షాన జాగృతి ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా నాయకుడు ఈట రాకేష్, నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరి మౌనిక్, జాగృతి నాయకులు సల్ల సాయికృష్ణ రెడ్డి, రెడ్డవేణ శ్రీనాథ్, ముక్క సాయికుమార్, ఇందురి సాయి, బండారి రేవంత్, సుమంత్, మహంతి, సల్మాన్, వెంకట్, ప్రవీణ్, గుర్రాల సాయిలు పాల్గొన్నారు.