14-03-2025 12:35:03 AM
రాచకొండ సీపీ సుధీర్ బాబు
ఎల్బీనగర్, మార్చి 13 : బాలికలను, మహిళలను వేధించే పోకిరీలను షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో తిరుగుతూ షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారన్నారు.
బాలికలు, మహిళలను వెంబడించి, వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ..వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ లోని క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.
రాచకొండ కమిషనరేట్ పరిదిలో మహిళలు, యువతులను వేధింపులకు గురిచేస్తున్న 187 (మేజర్స్-122 , మైనర్స్- 65) మందిని షీ టీమ్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరికి ఎల్బీనగర్ లోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసులో కౌన్సిలర్లతో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గత నెల1 నుంచి 28 తేదీ వరకు 241 ఫిర్యాదులు అందినట్లు వివరించారు.
వచ్చిన ఫిర్యాదుల్లో ఫోన్ల ద్వారా వేధించినవి -28, సోషల్ మీడియా ద్వారా వేధించినవి-85 , నేరుగా వేధించినవి 128 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో క్రిమినల్ కేసులు-14, పెట్టి కేసులు- 71, 108 మందికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి.ఉషావిశ్వనాథ్ తెలిపారు. కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్స్ స్పెక్టర్ ముని, అంజయ్య, అడ్మిన్ ఎస్త్స్ర రాజు, షీ టీమ్స్ సిబ్బంది, కౌన్సిలర్స్ పాల్గొన్నారు.