10-03-2025 04:27:57 PM
- ప్రభుత్వ పాఠశాలల కళాశాల విద్యార్థుల సదుపాయాలకు ఖర్చు చేస్తాం
- జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యానిధి పారదర్శకంగా పనిచేస్తుంది
-విద్యా నిధికి రూ 10 లక్షల విరాళం ఇచ్చిన మై హోం గ్రూప్
- మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్: రానున్న నాలుగేళ్ల కాలవ్యవధిలో విద్యానిధికి రూ.10 కోట్లను సమకూర్చేందుకు అవసరమైన సమాచారాన్ని దాతలకు చేరవేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ విద్యా నిధికి 10 లక్షల రూపాయల భారీ విరాళాన్ని మై హోం గ్రూప్స్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ చింతం, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయిను కలిసి కలెక్టర్ చాంబర్ లో అందజేశారు. మహబూబ్ నగర్ కు చెందిన పురుషోత్తం రెడ్డి విద్యానిధికి 5 వేల రూపాయల చెక్కును కలెక్టర్ కి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహబూబ్ నగర్ విద్యా నిధిని ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభించడం జరిగిందని, ఈ విద్యా నిధిని మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు, ప్రభుత్వ విద్యా సంస్థలో అత్యవసరమైన మౌళిక వసతుల కల్పన కోసం ప్రభుత్వ అధికారుల ద్వారానే ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ లో విద్యా నిధి, దాని ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకున్న ప్రముఖులు మై హోం అధినేత జూపల్లి రామేశ్వర్ రావు వారి కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ విద్యా నిధికి 10 లక్షల చెక్కును మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కి అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. అలాగే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేవారికి శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
పదవ తరగతి పూర్తి చేసి రానున్న విద్యా సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరే విద్యార్థులకు హన్వాడ మండలంలోని వేపూర్ నుంచి, అలాగే మహబూబ్ నగర్ మండలంలోని మన్యం కొండ నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల వరకు విద్యార్థులను తీసుకొచ్చి తిరిగి వారిని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న శ్రీమంతులు విద్యావంతులు విద్యానిధికి విరివిరిగా విరాళాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిజె బెనహార్, మాజీ కౌన్సిలర్ శంకర్, ఎం.ప్రవీణ్ కుమార్, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.