12-03-2025 12:06:53 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్, మార్చి 11 : వనపర్తి జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద నాట్కో ఫార్మా ట్రస్ట్ వారి సహకారంతో టీబీ రోగులకు పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్యశాఖ టీబీ విభాగం జాయింట్ డైరెక్టర్ రాజేశం, నాట్కో ఫార్మా ట్రస్ట్ సి ఎస్ ఆర్ హెడ్ మదన్, టీబీ కన్సల్టెంట్ గణ జిల్లా కలెక్టర్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం జిల్లాలో టీబీ వ్యాధిగ్రస్తు లను గుర్తించేందుకు మొబైల్ ఎక్స్రే మిషన్ ద్వారా స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, దాదాపు 90 రోజుల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుండగా, ఈ స్క్రీనింగ్ లో 721 మందికి టీబీ గుర్తించినట్లు చెప్పారు. ఈ స్క్రీనింగ్ ప్రక్రియ నిర్వహణలో ఆశా కార్యకర్తల పాత్ర ఎంతో కీలకంగా నిలుస్తుందని చెప్పారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన రోగులందరికీ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి శ్రీనివాసులు, ఇతర వైద్యశాఖ అధికా రులు సాయినాథ్ రెడ్డి, ఇతర అధికారులు, ఆశా వర్కర్లు, రోగులు తదితరులు పాల్గొన్నారు.