- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- మహిళల అభివృద్ధికి సంక్షేమ పథకాలు
- ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): మహిళా సాధికారత లేకుండా భవి ష్యత్తును ఊహించలేమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. మహిళా సాధికారత అనేది సమాజ అభివృద్ధికి చాలా కీలకమని చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని వీ హబ్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్బాబుతో కలిసి గవర్నర్ సందర్శించారు.
ఈ సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడానికి, వారికి సుస్థిరమైన భవిష్యత్తును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ..
గ్రామీణ ప్రాంతాల మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని చెప్పారు. టైర్2, టైర్3 నగరాల నుంచి వచ్చిన మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. వీ హబ్ సీఈవో సీతా పల్లచోల్లా మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామికవేత్తల కోసం దేశంలోనే మొదటిసారిగా వీహబ్ను ప్రారంభించిందని తెలిపారు.
ఆవిష్కరణల ప్రదర్శన
వీ హబ్లో పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు తమ తమ వినూత్న ఉత్పత్తులు, ఆవిష్కరణలను ప్రదర్శించారు. టెక్ స్టార్టప్ల నుంచి హ్యాండిక్రాఫ్ట్స్ వరకు విభిన్న రంగాల వస్తువులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంథని లాంటి సుదూరప్రాంతాల నుంచి వచ్చిన మహిళా పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్, మంత్రి స్టాళ్లను సందర్శించి, మహిళా పారిశ్రామికవేత్తలతో ముచ్చటించారు. మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇరువురు హామీ ఇచ్చారు.