calender_icon.png 1 February, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెర ముందు దండాలు వెనుక దందాలు

29-01-2025 12:00:00 AM

మట్టి దందాకు అధికారుల అభయ హస్తం దీనికి తోడైనా అధికార పార్టీ నాయకుల భాగస్వామ్యం  మునిసిపాలిటీ రోడ్ల పేరిట వెంచర్‌లకు తరలింపు

హుజూర్‌నగర్, జనవరి 28 :సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా నిబంధనలను అతిక్రమించి ఫణిగిరి రామస్వామి గుట్ట వద్ద ప్రభుత్వ భూముల్లో జేసీబీతో అడ్డగోలుగా తవ్వి పగలు రాత్రి అనే తేడా లేకుండా ట్రిప్పర్లతో యథేచ్ఛగా తరలించి మట్టిదందా కొనసాగిస్తూ ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారు. 

ఈ మట్టిదందాలో అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు భాగస్వామ్యులుగా ఉన్నారని సమాచారం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే  స్థానిక మున్సిపాలిటీ రోడ్లకు మట్టి అవసరమంటూ ప్రజలను తప్పుదారి పట్టించి బహిరంగంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి అక్రమార్కులు కోట్ల  రూపాయల దందా చేస్తున్నారు.

అక్రమ మట్టిదందాపై రెవెన్యూ , మైనింగ్, పోలీస్ , పర్యావరణ శాఖల అధికారులు సీరియస్గా చర్యలు తీసుకుంటే ఈ సమస్యను అరికట్టవచ్చు కానీ మట్టి అక్రమ దందాకు అధికారుల అభయ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొంతమంది సంబంధిత శాఖల అవినీతి అధికారులకు కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు మిలాఖతై తెర ముందు దండాలు తెర వెనుక దందాలు అన్న చందాన మట్టిదందా వర్ధిల్లుతున్నట్లు తెలుస్తుంది. మట్టి మాఫియాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈ దందాతో రాజకీయ నాయకుల సంబంధాలపై సమగ్ర విచారణ జరపాలని  స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.