చెన్నై, అక్టోబర్ 24: గురువారం ఉదయం కురిసిన భారీ వర్షానికి బెంగళూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని హోసూర్లోని రహదారిపై దాదాపు ఐదడుగుల మేర విషపు నురుగ వచ్చి చేరింది. దీంతో ఆ రహదారిపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సమీపంలోని కెలవరపల్లి రిజర్వాయర్లో నీటి నిల్వస్థాయి పెరిగి పోవడంతో గేట్లు తెరిచి.. తెన్పెన్నై నదిలోకి విడుదల చేశారు. ఈ సమయంలో గేట్ల ద్వారా రిలీజైన నీటి ప్రెషర్కు సమీప ప్రాంతాలు ముంపునకు గురవడంతో పాటు రోడ్లపై, చుట్ట్టుపక్కల నురుగ పేరుకుపోయింది. నురుగ ఉత్పన్నం అవడానికి గల కారణాలు ఇప్పటివరకు అధికారులు వెల్లడించనప్పటికీ.. పొరుగున ఉన్న కర్ణాటకలోని పారిశ్రామిక యూనిట్లు నదిలోకి వ్యర్థాలను విడుదల చేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.