- ఎగువ నుంచి 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
- ప్రాజెక్టు 26 క్రస్టుగేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
- శ్రీశైలంలో 10 గేట్ల ద్వారా నదిలోకి జలాలు
నల్లగొండ/నాగర్కర్నూల్, ఆగస్టు 29 (విజయక్రాంతి): కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు మరోసారి వరద పోటెత్తుతుంది. ఎగువన ఆల్మట్టి మొదలు నాగార్జునసాగర్ వరకూ భారీగా ఇన్ఫ్లోలు కొనసాగుతున్నాయి. నిండుకుండల్లా ఉన్న ప్రాజెక్టుల నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్కు గురువారం 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో అధికారులు ప్రాజెక్టు మొత్తం 26 క్రస్టుగేట్లలో 14 గేట్లను పది అడుగులు, 12 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి స్పిల్ వే ద్వారా మూడు లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
పులిచింతల ప్రాజెక్టు 13 క్రస్టుగేట్లను ఎత్తి మూడు లక్షల క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి 2,75,218 క్యూసెక్యుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 214 టిఎంసీలు 884 అడుగులమేర నీటి నిల్వ ఉండగా దిగువకు 10క్రస్టు గేట్ల ద్వారా 10ఫీట్ల మేర ఎత్తి 2,79,830 క్యూసెక్యుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ సాగర్వైపు పరుగులు పెడుతోంది.
నిజాంసాగర్ ఆయకట్టుకు నీటి విడుదల
కామారెడ్డి, ఆగస్టు 29(విజయక్రాంతి): నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న వరి పంటల కోసం ప్రాజెక్టు నుంచి గురువారం రెండో విడత నీటిని విడుదల చేశారు. ఆయకట్టు కింద 1.15లక్షల ఎకరాలు సాగు చేస్తుండగా ప్రాజెక్టు నుంచి మొదటి విడత జూన్లో 1.20 టీఎంసీల నీటిని విడుదల చేశారు. రెండో విడత కింద ప్రధాన కాలువ ద్వారా విడుదలను ప్రారంభించినట్టు ఏఈ శివప్రసాద్ తెలిపారు.