11-03-2025 12:50:01 AM
కుమ్రం భీం అసిఫాబాద్, మార్చి10( విజయక్రాంతి): మనువాదాన్ని ధిక్కరించి మహిళల అభ్యున్నతి కోసం పోరాడిన యోధురాలు సావిత్రిబాయి పూలే అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో సావిత్రిబాయి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి ఎన్నో అవమానాలను ఎదుర్కొని తన భర్త జ్యోతిబాపూలే ప్రోత్సాహంతో చదువుకొని దేశంలో మొట్టమొదటి మహిళగా నిలిచారని కొనియాడారు. ప్రస్తుతం పాలకవర్గాలు మహిళల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కూషన రాజన్న, కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్, దుర్గం దినకర్ ,జిల్లా కమిటీ సభ్యులు ఆనంద్ కుమార్, కార్తీక్ ,సాయి కృష్ణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.