29-04-2025 12:24:51 AM
కరీంనగర్, ఏప్రిల్ 28 (విజయ క్రాంతి): రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం కోసం జిల్లాలో 57,763 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుల ఆన్లున్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ప్రత్యేక అధికారులు దరఖాస్తుల విచారణను వేగవంతం చేయాలని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, ఈ.డబ్ల్యూ.ఎస్ కోటాలో నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు ఇదివరకే పంపించామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే దిశగా అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయాలని అన్నారు. బ్యాంకుల నుండి ఏవైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి పవన్ కుమార్, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.