02-04-2025 12:30:38 AM
హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): కాంప్లిమెంటరీ పాస్ల జారీ విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ), సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగింది. మంగళవారం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇరువర్గాల ప్రతినిధులు భేటీ అయ్యారు.
హెచ్సీఏ తరఫున సెక్రటరీ ఆర్. దేవ్రాజ్, ఎస్ఆర్హెచ్ తరఫున కిరణ్, శరవణన్, రోహిత్, సురేశ్ సమావేశానికి హాజరయ్యా రు. ఈ నేపథ్యంలో ట్రై పార్టీ (బీసీసీఐ, ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ) కింద స్టేడియంలోని అన్ని కేటగిరీలు కలిపి ఒప్పందం ప్రకారం 10 శాతం సీట్లు కేటాయిస్తామని ఎస్ఆర్హెచ్ బృందం తెలిపింది.
అయితే పాత పద్ధతిలోనే అన్ని కేటగిరీల్లో పాసులు కేటాయించాలని దేవ్రాజ్ పేర్కొన్నారు. గతంలో కాంప్లిమెంటరీ కింద ఇచ్చే 3900 టికెట్లను ఇవ్వాలని కోరుతూ హెచ్సీఏ తీర్మానించింది. ఈ అంశంపై ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు ఫ్రాం చైజీ సీఈవో షణ్ముగంతో ఫోన్లో చర్చలు జరిపారు.
సీఈవోతో చర్చ అనంతరం హెచ్సీఏకు కేటాయించే టికెట్లను యథావిధిగా కొనసాగిస్తామని ఎస్ఆర్హెచ్ తెలిపింది. దీంతో వివాదానికి ఫుల్స్టాప్ పడినట్టయిం ది. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్లకు హెచ్సీఏ సహకారం పూర్తిగా ఉంటుందని దేవ్రాజ్ తెలిపారు.
అనంతరం ఇరువర్గాలు వివాదం ముగిసిందని సంయుక్తంగా ప్రకటించాయి. అయితే ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ వివాదం నేపథ్యం లో సీఎం రేవంత్ విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. బుధవారం కొత్తకోట శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలోని విజిలెన్స్ కమిషన్ ఇరువర్గాలతో సమావేశం కానుంది.