calender_icon.png 24 October, 2024 | 11:49 PM

గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి

09-07-2024 03:21:45 AM

  • తిట్లు, ఆరోపణలు కాదు.. అభివృద్ధిపై ఫోకస్ పెడదాం 
  • కేంద్రం, రాష్ట్రాల సమనయంతోనే ముందుకు 
  • కేంద్ర నుంచి సహకారం అందించే బాధ్యత నాదే 
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల, జూలై 8 (విజయక్రాం తి): గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాలతోపాటు దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్ల పట్టణంలో మున్నూరు కాపు సంఘ కల్యాణ మండపం పనులకు శంకుస్థాపన చేశారు. వీర్నపల్లి మండలం వన్‌పల్లిరెడ్డి సంఘం భవనం, శాంతినగర్ గ్రామంలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ముగిసినందున ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేసి, ఆరోపణలను పక్కనపెట్టి అభివృద్ధిపైనే ఫోకస్ పెడుదామని సూచించారు.

కేంద్ర, రాష్ట్రాల సమనయంతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సం పూర్ణ సహకారం అందించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. రెండోసారి ఎంపీ గా గెలిచేందుకు అత్యధిక మెజారిటీ ఇచ్చిన సిరిసిల్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. కరీంనగర్‌లో విద్య, వైద్యం, రవాణా రంగాల అభివృద్ధికి కేంద్రం నిధులు తీసుకొస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు.