హైదరాబాద్ (విజయక్రాంతి): జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ నగరంలో చెత్త తరలింపు వాహనం సిబ్బందిపై ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం తిరిగి తార్నాక వైపు వెళ్తుండగా డిప్యూటీ మేయర్కు తెలుగు తల్లి ఫ్లుఓవర్పై చెత్తను పారబోస్తూ వెళ్తున్న జీహెచ్ఎంసీ వాహనం కన్పించింది. వెంటనే ఆ వాహనాన్ని ఆపాలని ఆదేశించిన డిప్యూటీ మేయర్.. ఒక వైపు నగరంలో పరిశుభ్రత కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటే.. మీరు మాత్రం రోడ్లపై చెత్తను వెదజల్లుతారా అంటూ సీరియస్ అయ్యారు. చెత్త తరలించే విధానం ఇదేనా అంటూ మందలించారు. వాహనంపై పట్టాను సక్రమంగా బిగించనందున ఆ లారీలోని చెత్త అంతా రోడ్డుపై జారుతూపోతుంది. దీన్ని గమనించి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి ఆ వాహనాన్ని నిలిపి వేసి క్లాస్ తీసుకున్నారు. అంతే కాకుండా, ఆ లారీకున్న పట్టాను సరిగా బిగించిన తర్వాతనే ఆ వాహనాన్ని వదిలారు. నగరంలో చెత్త తరలింపు విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. ఇలాంటి చర్యలు పునరావృత్తం కాకుండా చూడాలని హెచ్చరించారు.