14-04-2025 12:25:29 AM
బీసీ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ముషీరాబాద్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి) : ఏపీకి చెందిన 26 బిసి కులాలను తెలంగాణలో చేర్చే నిర్ణయాన్ని బీసీ కమిషన్ పునసమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్ లో బీసీ-ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఎమ్మెస్ నరహరి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన బీసీ కులాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో ఆంధ్ర బీసీ కులాలను తీసుకొచ్చి తెలంగాణ బీసీ కులాలలో కలపడం సమంజసం కాదన్నారు.
ఏపికి చెందిన కొంతమంది పనిగట్టుకొని తెలంగాణ రాష్ట్ర బీసీ-ఏ కులాల్లోకి రావడానికి ప్రయత్నించడం బాధాకరమన్నారు. ఇక్కడ ఉన్న తెలంగాణ బీసీ కులాలను ఏపీలోని బీసీ కులాల్లో చేర్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అని ఎదురు ప్రశ్నించారు. ఒకవేళ ఈ 26 బిసి కులాలను తెలంగాణ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేర్చండని, తమకు అభ్యంతరం లేదని మల్లన్న తెలిపారు.
హైకోర్టు తీర్పును ప్రభుత్వం ఉల్లంఘించడం మంచిది కాదన్నారు. బీసీ కులాల మధ్య పంచాయతీ పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో బీసీ నేతలు ప్రొ.డా.భాగయ్య, కే.రామచందర్, ప్రొ.సాం బయ్య, ప్రొ.సాంబమూర్తి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా రాణి, పరమేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.