03-03-2025 01:52:42 AM
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి
వనపర్తి టౌన్, మార్చి 2: వనపర్తిలో తాను చదువుకున్న రోజులను మరచి పోలేనని, తాను చదివిన వనపర్తి పాఠశాల, కళాశాల పూర్వ మిత్రులను కలుసుకోవడం ఎంతో సంతోషం కలిగించిందని ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకు స్థాపన కు వచ్చిన సీఎం స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ మిత్రులతో అపూర్వ కలయిక కార్యక్రమానికి హాజరయ్యారు. వనపర్తి లో పాఠశాల విద్యతో పాటు ఇంటర్ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తన ఆత్మీయ మిత్రులను కలవడానికి రావడంతో ఆయనను కలిసేందుకు దాదాపు 125 మంది పాఠశాల, కళాశాల స్నేహితులు సీఎం రేవంత్ రెడ్డి కి ఆత్మీయ స్వాగతం పలికారు.
సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తానే స్నేహితుల వద్దకు వెళ్లి అందరినీ ఎంతో ఆత్మీయంగా పలకరించారు. మొదటి టేబుల్ లో కూర్చున్న మిత్రులతోపాటు చివరి టేబుల్ వరకు ఉన్న మిత్రులందరినీ కలిసి వారితో ఫోటోలు దిగారు. తమ స్నేహేతుడు ముఖ్యమంత్రి హోదాలో తమను కలుసుకోవడంతో మిత్రులందరూ ఎంతో ఆనందంతో ఉప్పొంగి పోయా రు. కొందరు సీఎం ను కలిసే సరికి వారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అయితే తమ స్నేహితుడైన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తనకు చదువు చెప్పిన గురువులను కలిసి నమస్కరించారు.
తమ శిష్యుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, సీఎం హోదాలో వచ్చి తమను కలవడంతో ఆ గురువులు సై తం రేవంత్ రెడ్డిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం తన భుజాలపై గురువుల చేతులు వేసుకుని వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. చివరగా సీఎం రేవంత్ రెడ్డి తన స్నేహితులతో కలిసి భోజనం చేశారు. 1983-85 ఇంటర్ బ్యా మిత్రులతో గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీ హరి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచుకుళ్ళ రాజేష్, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మైనా ర్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొన్నారు.