06-03-2025 12:00:00 AM
మేడ్చల్, మార్చి 5(విజయక్రాంతి): అధిక వడ్డీ ఆశ చూపి ఒక కంపెనీ రూ.14 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంఘటన కూకట్ పల్లి లో జరిగింది. ఒక ఇన్ఫ్రా కంపెనీ పెట్టుబడిదారులకు ప్రతినెల ఫ్రిడ్జులు, టీవీలు బోనస్ గా ఇస్తామని ప్రక టించింది. దీంతో అనేకమంది ఆకర్షితులయ్యారు. రూ. లక్షకు టీవీ, రూ. రెండు లక్షలకు వాషింగ్ మిషన్, రూ. మూడు లక్షల కు ఫ్రిడ్జ్ బోనస్ గా ఇస్తామని ఆశ చూపింది. అంతేగాక లక్ష పెట్టుబడి పెడితే రెండు లక్షలు ఇస్తామని నమ్మించింది.
దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఆకర్షితులై పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. కంపెనీ అనతి కాలంలోనే రూ.14 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత మొహం చాటేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు చైర్మన్ ను అరెస్టు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.