13-12-2024 12:46:49 AM
* రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
* బేలలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
హైదరాబాద్ /ఆదిలాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు చలి పులి పంజాకు గజగజ వణుకుతున్నారు. కొద్దిరోజులుగా ఇక్కడ ఉష్ణోగ్ర తలు పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని బేలలో గురువారం 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే రోజు బేలలో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది రాష్ట్రంలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 10.8 డిగ్రీలు నమోదు కాగా, ఈసారి 7 డిగ్రీలకు పడిపోయింది. కుమ్రం భీం జిల్లా సిర్పూర్(టి)లో 7.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 8.3, మంచిర్యాల జిల్లా తపాలాపూర్ లో 10.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతకు వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఐఎండీ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్, సంగారెడ్డి, జగిత్యాల, వికారాబాద్ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నది.