- దమ్ముంటే ట్యాపింగ్ లేదని చెప్పమనండి
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): సీఎం రేవంత్రెడ్డి సొంత మంత్రులతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆరోపించారు. ఆయనకు దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించి ఫోన్ ట్యాప్ చేయడం లేదని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం హైదారాబాద్లో జరిగిన ఏబీపీ న్యూ స్ సదరన్ సమ్మిట్లో పాల్గొన ఆయన పాల్గొని మాట్లాడారు. దేశం లో పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కాంగ్రెస్ పార్టీ అని, మా ప్రభుత్వం హయాంలో రాజ్యాంగబద్ధంగా పార్టీ శాసనసభాపక్షం విలీనం జరిగిందన్నారు. రాహుల్గాంధీ ఢిల్లీ లో రాజ్యాంగ పత్రులను పట్టుకొని తమాషా చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల అంచనాలు పెరగడం తమ ఓటమికి కారణమైందని, ఓటమి తర్వాత అంతర్గతంగా సమీక్షించుకొని ప్రజల కోసం పోరాడేందుకు ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఒక్క ఎన్నికల్లో ఎదురైన పరాజయంతో పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు.
ఎక్కువ మంది పిల్లలను కన్నాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రస్తుతం జనాభాకు తగ్గట్లుగా మౌలిక వసతులు లేవని, ప్రభుత్వాలు ముందుగా వాటిపై దృష్టి సారించాలన్నారు. జనాభా నియంత్రణపై దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు.