బీఆర్ఎస్ హయాంలో బోగస్ కంపెనీలతో ఒప్పందాలు
షాడో సీంగా కేటీఆర్ వ్యవహరించింది నిజం కాదా?
మంత్రి కొండా సురేఖ ఫైర్
హైదరాబాద్, ఆగస్టు 9(విజయక్రాంతి): రాష్ట్రావృద్ధి కోసమే సీఎం రేవంత్రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం విదేశీ పర్యటనల వెనక వ్యక్తిగత స్వార్థమేమీ లేదన్నారు. పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన కుటుంబం అనేక కంపెనీలతో బోగస్ ఎంవోయూలు చేసుకున్నారని ఆరోపించారు.
అలా రాష్ట్రాన్ని నిలువునా దోచు కున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజె క్ట్, దళిత బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టారన్నారు. కాంగ్రెస్ పాలన వచ్చేసరికి అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక వేదాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నదన్నారు. బీఆర్ఎస్ అసత్య ప్రచారాన్ని కాంగ్రెస్ తిప్పికొడుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేటీ ఆర్ షాడో సీఎంగా వ్యవహరించిన మాట వాస్తవం కాదా..? అని మంత్రి నిలదీశారు. ఇప్పుడేమో కేటీఆర్, హరీష్రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు పనికిమాలిన మాట లు మాట్లాడుతున్నారని, తమ ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.