12-04-2025 04:58:51 PM
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల హక్కులను హరించివేస్తూ పాలన సాగిస్తున్న బిజెపి..
భగత్ సింగ్ వర్ధంతి, డాక్టర్ అంబేద్కర్ జయంతి సాక్షిగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నినదిద్దాం..
సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భాషలు, మతాలు కార్క్సర్ల 147 కోట్ల మంది భారతీయులను ఒక్కతాటిపైకి తెచ్చిన మన రాజ్యంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలనా సాగిస్తోందని, పార్లమెంటులో ఉన్న మందబలంతో ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్న కేంద్ర సర్కారుపై ప్రజలు తిరగబడితేనే ప్రజాస్వామ్యం రక్షించబడుతుందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన దేశవ్యాప్త నిరసనల పిలుపులో భాగంగా శనివారం సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని సుజాతనగర్ మండలం కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ భగత్ సింగ్ చిత్రపాఠాలతో మండల కేంద్రంలో భారీ ప్రదర్శని నిర్వహించిన అనంతరం మానవాహారం చేపట్టి నిరసన తెలిపారు.
ఈ సందర్బంగా ఏర్పాటైన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ.. కులం కన్న దేశం మిన్న అని భావించిన భగత్ సింగ్ త్రయం లాంటి అనేక మంది దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేశారని, స్వేచ్చాయుత భారతావనికి దేశం గర్వించదగ్గ రాజ్యాంగాని డాక్టర్ అంబెద్కర్ అందించాడని అన్నారు. త్యాగధనుల ఆశయాలకు తూట్లు పొడుస్తూ, రాజ్యాంగాన్ని స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ బిజెపి వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని, ప్రశ్నించిన వారిని నిర్బంధాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సిబిఐ, ఈడీ, ఎన్నికల సంఘం తదితర రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ దక్షిణాది రాష్ట్రాలపై వివక్షత ప్రదర్శిస్తున్నారన్నారు. సవత్సరానికి కోటి ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు.
దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలకు, మహిళలపై దాడులు ప్రమాదకర పరిస్థితుకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి దేశ సార్వభౌమత్వాన్ని మంటగలుపుతున్నారని, దేశంలోని సహజవనరులను, ప్రభుత్వ సంస్థలను, వ్యవసాయ రంగాన్ని, ప్రభుత్వ విద్యను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ పేద, మధ్యతరగతి వర్గాలను రోడ్డుపాలు చేస్తున్నారని విమర్శించారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను సైతం యాజమాన్యాలకు అనుకూలంగా మార్చే దుశ్చర్యాలకు కేంద్రం పూనుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజలు అప్రమత్తమై కేంద్ర చర్యలను తిప్పికొట్టి దేశాన్ని బిజెపి నుంచి రక్షించుకోవాలను కోరారు.
కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అహర్నిశలు శ్రమిస్తున్నారని, అయన కృషికి రాజకీయాలకు అతీతంగా సహరించాలని, కొందరు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని వారికి ప్రజలే తగిన రీతిలో బుద్ది చెపుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు భూక్యా దస్రు, వాసిరెడ్డి మురళి, జి వీరాస్వామి, కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, ఎమ్ ధనలక్ష్మి, కొమారి హన్మంతరావు, జక్కుల రాములు, కె రత్నకుమారి, తాళ్ల వెంకటేశ్వర్ రావు, నాయకులు ధర్మరాజు, యూసుఫ్, నేరెళ్ల రమేష్, టి పాపారావు, గణేష్, గోవిందు, ఉపేందర్, దుర్గ, మల్లేష్, రసూల్, అంకూస్, కొమారి కృష్ణ, మురళి, సాపావట్ రవి, మాన్త్యా తదితరులు పాల్గొన్నారు.