- కేంద్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం
- గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పుడు నివేదికలే శాపం
- మంత్రి సీతక్క మండిపాటు
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని మంత్రి సీతక్క ఆక్షేపించారు. తెలంగాణపై కేంద్రం పక్షపాత వైఖరితో కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. రాష్ర్ట పునర్విభజన చట్టాన్ని గౌరవిస్తూ ఏపీకి బడ్జెట్లో నిధులు కేటా యించిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం మర్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర ్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగ పాఠంలో తెలంగాణ పదం లేకపోవడం తెలంగాణపై బీజేపీ సర్కార్ ప్రదర్శిస్తున్న వివక్షకు అద్దం పడుతుందన్నారు. రాష్ర్టం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణకు కేంద్రం గుండు సున్నా ఇచ్చిందని ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష బీఆర్ఎస్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికే పరిమితం అవుతోందన్నారు.