22-03-2025 12:00:00 AM
ఆదిలాబాద్, మార్చ్ 21 (విజయ క్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రణదీవ్ నగర్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సంబరాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మాదిగ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మల్లేష్ మాట్లాడుతూ... మందకృష్ణ మాదిగ నేతృత్వంలో సుదీర్ఘంగా మూడు దశాబ్దాలుగా న్యాయమైన డిమాండ్ తో మొదలైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం 15% రిజర్వేషన్లను ఏ.బి.సి.డి లుగా వర్గీకరించాలని ఒకే నినాదంతో అలుపెరుగని పోరాటం చేయడం జరిగిందన్నారు.
ఈ పోరాటంలో 30 సంవత్సరాలుగా లక్షలాది మంది, ఉద్యమకారులు జాతి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని త్యాగాలు చేశారని గుర్తు చేశారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో వచ్చిన రిజర్వేషన్ అవకాశాలను ప్రతి గడపకు చేరే విధంగా కృషి చేస్తన్నారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.