10-02-2025 12:51:51 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాం తి): బీసీ కులగణనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణభవన్లో జరిగిన బీసీ సమావేశం అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేపై తీవ్ర విమర్శలు చేశారు.
బీసీల జనాభాను కావాలనే తగ్గించిన సీఎం రేవంత్ రెడ్డి, బీసీలకు క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకుపోతామని చెప్పారు. ఇప్పు డే కాదు.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, ప్రభుత్వంలోనూ బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసేదాకా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. “ఉల్టా చోర్ కొత్వాల్కే డాం టే” అన్నట్టుగా రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను విమర్శిస్తోందని ఎద్దేవా చేశారు. ఐదున్నర శాతం జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని లేనట్టుగా రేవంత్రెడ్డి చేసి దుర్మార్గానికి పాల్పడ్డాడని మండిపడ్డారు.
ఈసారి కులగణనలో కేసీఆర్ సహా మేమం తా పాల్గొంటాం.. కోరిన వివరాలు ఇస్తామన్నారు. రీసర్వేకు వెంటనే ఆదేశించాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేయొద్దని, 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
నేటి నుంచే భావజాలవ్యాప్తి..
ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42 శాతం బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, 15 నెలలు అవుతున్నా కనీసం 15 పైసలు కూడా ఇవ్వలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 16 కార్పొరేషన్లు బీసీ కులాలకు ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేషన్కు రూ.50 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారని, కనీసం 50 పైసలు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు.
రాష్ర్టంలోని బీసీల ఆందోళన ఆవేదనను తాము అర్థం చేసుకున్నామని, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సోమవారం నుంచి నియోజకవర్గాలు, మండ లాలు, జిల్లా కేంద్రాల వారీగా భావజాల వ్యాప్తిని ప్రారంభిస్తామన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా వారి గొంతు కోసి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఏం చేయాలన్న దానిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించామన్నారు. దీనిపై కేసీఆర్కు నివేదించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని కేటీఆర్ వెల్లడించారు. సమావేశంలో బీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.