22-02-2025 12:00:00 AM
వాషింగ్టన్, ఫిబ్రవరి 21: బ్రిక్స్ కూటమి కనుక సొంత కరెన్సీ తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే ఆ కూటమి దేశాల మీద 150 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ ఇది వరకే హెచ్చరించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘బ్రిక్స్ దేశాలు డాలర్ను నాశనం చేయడానికి చూస్తున్నాయి. వారు కొత్త కరెన్సీకి ప్రయత్నిస్తున్నారు. నేను అధికారం చేపట్టగానే.. వారి చర్యలతో విబేధించా.
ఇలాగే వ్యవహరిస్తే 150 శాతం సుంకాలు వేస్తానని హెచ్చరించా. మాకు మీ ఉత్పత్తులు అవసరం లేదు అని చెప్పా. దాంతో బ్రిక్స్ కూటమి సైలెంట్ అయిపోయింది. వారికి ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆ తర్వాత మనకు బ్రిక్స్ అనే పదమే వినిపించలేదు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
డాలర్తో కనుక ఆటలాడితే బ్రిక్స్ దేశాలు 100 శాతం సుంకాలు భరించాల్సి ఉంటుందని.. వారు డాలర్కు ప్రత్యామ్నాయంగా కరెన్సీని తీసుకొస్తే అమెరికా బ్రిక్స్ కూటమిలో ఉన్న దేశాలతో వాణిజ్యం చేయదని ట్రంప్ ఫిబ్రవరి 13న హెచ్చరించారు.
అసలేం జరిగిందంటే..
2023లో సౌతాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్ దేశాల సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. ‘బ్రిక్స్ దేశాలు జాతీయ కరెన్సీలలో సెటిల్మెంట్లను విస్తరించాలి. బ్యాంకుల మధ్య సహకారాన్ని పెంపొందించు కోవాలి’ అని అన్నారు. దీంతో డాలర్ భవిష్యత్ గురించి బెంగపడిన అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ బ్రిక్స్ దేశాలపై సుంకాల భయాన్ని మోపారు. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, సౌతాఫ్రికా వంటి దేశాలు ఉన్నాయి.