11-02-2025 12:00:00 AM
బ్రహ్మానందం, అతని కుమారుడు రాజాగౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు నిఖిల్ తెరకెక్కించారు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో సోమవారం ఈ మూవీ ట్రైలర్ను హీరో ప్రభాస్ విడుదల చేశారు. ట్రైలర్ను గమనిస్తే.. ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ యువకుడు థియేటర్ ఆర్టిస్ట్ కావాలనుకుంటాడు. దీనికోసం అతనికి కొంత డబ్బు అవసరం అవుతుంది. ఆ క్రమంలో అతనికి ఓ ముసలి వ్యక్తి పరిచయమై, తన ఆరెకరాల పొలం ఇచ్చేస్తానంటాడు.
అయితే 10 రోజుల పాటు తన స్వార్థం కోసమే ఆలోచించకుండా పక్కనున్న వారి కోసం కూడా ఆలోచించాలనే కండీషన్ పెడతాడు సదరు ముసలి వ్యక్తి. ఆ తర్వాత ఏం జరిగిందనేదే సినిమా. వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శాండిల్య పిసాపాటి సంగీతం సమకూర్చగా, మితేశ్ పర్వతనేని కెమెరా మెన్గా, ప్రణీత్ కుమార్ ఎడిటర్గా పనిచేశారు.