కిషన్రెడ్డి, ఈటల రాజేందర్ కేంద్ర మంత్రులు అవుతారు
బీజేపీ త్రిస్సూర్ ఎంపీ అభ్యర్థి, నటుడు సురేశ్ గోపి
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): ప్రస్తుతం దేశమంతా బీజేపీ గాలి వీస్తోందని, మరోసారి మోదీ ప్రధాని అవ్వడం ఖాయమని మళయాల నటుడు, బీజేపీ త్రిస్సూర్ ఎంపీ అభ్యర్థి సురేశ్ గోపి పేర్కొన్నారు. తెలంగాణలోనూ బీజేపీ హవా నడుస్తున్నదని స్పష్టంచేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీ కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని, కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో వారు మంత్రులుగానూ బాధ్యతలు స్వీకరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని మిగతా 15 మంది కూడా ఎంపీలుగా విజయం సాధించి ఈ ప్రాంత అభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తారని పేర్కొన్నారు.
బీజేపీతోనే దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. తిస్సూర్లో తాను ఎంపీగా పోటీ చేశానని, ప్రజల నుంచి తనకు మంచి మద్దతు లభించిందని భావిస్తున్నట్టు చెప్పారు. కేరళలో కేంద్ర ప్రభుత్వం అత్భుతమైన జాతీయ రహదారులు వేసిందని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కేరళలోనూ ఈసారి ఊహించని మార్పు కనిపించబోతోందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్రెడ్డి, ప్రచార కార్యదర్శి ఎన్వీ సుభాశ్ తదితరులు పాల్గొన్నారు.