10-04-2025 01:28:46 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: భారత రక్షణ రంగంలో అతిపెద్ద ఒప్పందానికి రంగం సిద్ధమైంది. నౌకాదళ అమ్ముల పొదిలోకి అధునాతన రఫేల్ మెరైన్ ఫైటర్లు వచ్చి చేరనున్నాయి.
ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ నేవీ జెట్లను కొనుగోలు చేసేందుకు ప్రధాన మంత్రి మోదీ సారథ్యంలోని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆమోదం తెలిపినట్లు రక్షణరంగవర్గాలు బుధవారం తెలిపాయి. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 63వేల కోట్లు.
ఈ ఒప్పందం ద్వారా భారత నేవీకి 22 సింగిల్ సీటర్ జెట్స్, 4 ట్విన్ సీటర్ జెట్స్ సమకూరనున్నాయి. అంతే కాకుండా వీటి నిర్వహణ, లాజిస్టికల్ సపోర్ట్, పర్సనల్ ట్రైనింగ్, దేశీయంగా కొన్ని విడిభాగాలు తయారు చేయాలని ఆఫ్సెట్ నిబంధనల కింద ఉంది. ఈ ఒప్పందం ప్రకారం నేవీ అధికారులకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
విమానవాహక నౌకలపై..
దేశీయంగా అభివృద్ధి చేసిన విమాన వాహక నౌకపై ఈ రఫేల్ మెరైన్లను మోహరించాలని భారత్ భావిస్తున్నట్టు సమాచారం. కొత్తగా రానున్న ఈ రఫేల్ మెరైన్ల ద్వారా మన నౌకాదళ శక్తి గణనీయంగా పెరగనుంది. ఈ రఫేల్ మెరైన్స్లో అత్యాధునిక ఏవియానిక్స్, ఆయుధాలు వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ రఫేల్ మెరైన్ జెట్స్ తొలి బ్యాచ్ 2029 చివర్లో అందే అవకాశం ఉందని 2031 వరకు ఈ ఒప్పందంలో ఉన్న మొత్తం జెట్స్ భారత్ చేతికి వస్తాయని తెలుస్తోంది. ఈ అధునాతన జెట్లను భారత ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు అయిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, పూర్తిగా భారత సాంకేతికతతో తయారు చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్లపై మోహరించనున్నారు.
ఇప్పటికే ఉన్న మిగ్ జెట్ల స్థానంలో వీటిని మోహరించనున్నారు. త్వరలోనే భారత్ ప్రభుత్వాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు తెలు స్తోంది. ఇప్పటికే భారత ఎయిర్ఫోర్స్ వద్ద 36 రఫేల్ జెట్స్ ఉన్నాయి. వీటిని ఉత్తరభారతంలోని రెండు బేస్లలో మోహరిం చారు. భారతదేశ చరిత్రలో ఇదే అతిపెద్ద ఫైటర్ జెట్ డీల్గా అభివర్ణిస్తున్నారు.