calender_icon.png 19 April, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం

17-04-2025 07:45:01 PM

కలెక్టర్ కుమార్ దీపక్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): భూ సమస్యలను పరిష్కరించి ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఉండేందుకే చరిత్రాత్మక భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ... భూ భారతి చట్టంతో ఒకేరోజు రిజిస్ట్రేషన్ తో పాటు మ్యుటేషన్ సౌకర్యం కల్పిస్తున్నటు ఆయన వివరించారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసే ముందు సంబంధిత భూమి సర్వే చేసి మ్యాప్ తయారు చేస్తారని పేర్కొన్నారు.

తహసీల్దార్ ద్వారా భూ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్ చేస్తారని తద్వారా నెలల తరబడి మ్యుటేషన్ కోసం తిరగడం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవడం ఉండదన్నారు. రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని, పెండింగ్ సాదా బైనామా ద్వారా కూడా దీంట్లో ఉంటుందని తెలిపారు. అంతకుముందు అదనపు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ లు ఈ చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం ఇటిక్యాల చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ల గురించి చెరువు పరిరక్షణ కమిటీ కన్వీనర్ సప్ప రవి ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. త్వరలోనే ఎఫ్ టీ ఎల్ హద్దులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డిఓ శ్రీనివాసులు, తహసీల్దార్ దిలీప్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్, జిల్లా ఆర్ టి ఏ మెంబెర్ అంకతి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి, యూత్ అధ్యక్షులు రాందేని వెంకటేష్ మండల అధ్యక్షులు పింగళి రమేష్, మాజీ కౌన్సిలర్ రాందేని వెంకటేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.