calender_icon.png 25 September, 2024 | 3:55 PM

కక్షపూరితంగానే నాపై దాడి

25-09-2024 03:34:46 AM

ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు నర్సింహ

రాజేంద్రనగర్, సెప్టెంబర్24: రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు చిలకమర్రి నర్సింహపై మంగళవారం కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నరేందర్‌రెడ్డి, బాధితుడు తెలిపిన వివరాలు.. శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ గ్రామానికి చెందిన చిలకమర్రి నర్సింహ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ సభ్యుడిగా వ్యవహరించారు.

మంగళవారం ఉదయం నర్సింహ ముచ్చింతల్ సమీపంలో టీతాగి తిరిగి స్వగ్రామానికి కారులో వస్తుండగా జిమ్స్ హాస్పిటల్ సమీపంలో కత్తుల జనార్దన్, కత్తుల సాయివర్దన్, కత్తుల రేణుబాబు, పెంజర్ల అరుణ్ తదితరులు కత్తులు, రాళ్లతో ఆయన కారుపై దాడికి యత్నించారు.

ఎలాగోలా అక్కడినుంచి తప్పించుకున్న నర్సింహ తనపై దాడి వెనుక మై హోం సంస్థ జూపల్లి జగపతిరావు హస్తం ఉందని శంషాబాద్ ఇన్‌స్పెక్టర్ నరేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. తనకు జగపతిరావు నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

తాను అనే ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడానని, ఇది దృష్టిలో ఉంచుకొనే జగపతిరావు తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారడని నర్సింహ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.