26-03-2025 12:49:11 AM
యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యం
చేవెళ్ల, మార్చి 25: స్టార్టప్ ల అభివృద్ధి, యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఇక్ఫాయ్ ఇంక్యూబేటర్ , టీ హబ్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు మంగళవారం శంకర్ మండలం దొంతాన్ పల్లిలోని క్యాంపస్లో ఇక్ఫాయ్ వైస్ ఛాన్సలర్, టీహబ్ చీఫ్ ఇన్నేవేషన్ ఆఫీసర్ సుజిత్ జాగిర్దార్ ఎంవోయూ (మొమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్)పై సంతకాలు చేసి.. ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, రీ సెర్చ్ స్కాలర్స్, యువ పారిశ్రామిక వేత్తలకు ఇక్ఫాయ్ చక్కటి వేదికగా మారనుందని తెలిపారు.
టీ-హబ్ నైపుణ్యంతో ఇక్ఫాయ్ విద్యా సంస్థల శక్తిని సమన్వయం చేసి స్టార్టప్ ల ఆవిష్కరణ, శిక్షణ, నిధులు, మార్కెట్ యాక్సెస్ కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. స్టార్టప్ ప్రాజెక్టులను ఇంటర్న్ షిప్ గా ఎంచుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తామన్నారు. టీ-హబ్ సీఐవో సుజిత్ జాగిర్దార్ మాట్లాడుతూ.. స్టార్టఫ్ లను ప్రోత్సహించడంలో టీహబ్ ముందు వరుసలో ఉంటుందని, ఇక్ఫాయ్తో ఒప్పందం ద్వారా మరిన్ని వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించే అవకాశం దక్కిందన్నారు. పరిశోధన , పారిశ్రామిక ఆవిష్కరణల మధ్య వారధిగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇక్ఫాయ్ ఇంకుబేటర్ ఎక్టిక్యూటివ్ డైరెక్టర్ సాయినాథ్ మణికొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీ హబ్ ప్రతినిధులు సీనియర్ ఇన్వెస్టర్ స్టార్టప్ ఫండ్ డైరెక్టర్ దేవిశెట్టి చింటిరెడ్డి, ఛీఫ్ డెలివరీ ఆఫీసర్ ఫణి కొండెపూడి, ఇక్ఫాయ్ రిజిస్టార్ డాక్టర్ విజయలక్ష్మి, బ్రాండింగ్ డైరెక్టర్ సుధాకర్ రావు, డైరెక్టర్లు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.