calender_icon.png 21 September, 2024 | 1:56 PM

అది నరకం కంటే ఎక్కువే!

15-09-2024 12:09:50 AM

రష్యా సైన్యం నుంచి విముక్తి పొందిన తెలంగాణ యువకుడు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: రష్యా ఉక్రెయిన్ సుదీర్ఘ యుద్ధం వల్ల ఆ ప్రాంతంలో చిక్కుకున్న అమాయకులు నరకం అనుభవిస్తున్నారని యుద్ధం నుంచి బతికి బయటపడ్డ తెలంగాణ వ్యక్తి మహమ్మద్ సుఫియాన్ తెలిపాడు. ఏజె ంట్ మోసంతో 2023 డిసెంబర్ నుంచి రష్యా సైన్యం వద్ద నిర్బంధంగా ఉన్నానని, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వ చొరవతో సురక్షితంగా బయటపడి శుక్రవారం స్వదేశం చేరాడు. నారాయణపేట జిల్లాకు చెందిన అతడు విదేశాల్లో ఉపాధి కోసం ముంబైకి చెందిన ఓ ఏజెంటును సంప్రదించగా, సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రష్యా సైన్యానికి అప్పగించాడు.

దీంతో 8 నెలలు సుఫియాన్ చావు అంచున బతికాడు. ఇటీవల ప్రధాని మోదీ రష్యా పర్యటన సందర్భంగా ఆ దేశ సైన్యంలో ఉన్న భారతీయులందరినీ విడుదల చేయాలని గట్టిగా కోరటంతో సుఫియాన్‌కు విముక్తి లభించింది. తాను ఎదుర్కొన్న భయానక అనుభవా లను ఆయన పీటీఐతో పంచుకొన్నాడు. ‘నేను ఇంటికి తిరిగి వచ్చానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. యుద్ధంలోని భయానక దృశ్యాలు ఇప్పటికీ నా కండ్ల ముందు కదలాడుతున్నాయి. 

ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ప్రభుత్వం, మీడియా చొరవతోనే నేను ప్రాణాలతో బయటపడ్డాను. ఉద్యోగం కోసం 2023లో ముంబైకి చెందిన ఓ ఏజెంటును సంప్రదించాను. హైదరాబాద్ నుంచి చెన్నై వయా దుబాయ్ మీదుగా నన్ను ఆ ఏజెంట్లు రష్యా సరిహద్దుకు తీసుకెళ్లాడు. సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. కానీ మోసం చేసి రష్యా సైన్యంలో సహాయకుడిగా పనిలో పెట్టాడు. నాలాగే అక్కడ ఏజెంట్ల చేతిలో మోసపోయిన చాలామంది ఉన్నారని తెలిపాడు.