22-03-2025 01:53:30 AM
చికిత్స అనంతరం తిరిగి పరీక్షకు హాజరు
కూసుమంచి, మార్చి 21:-పదో తరగతి పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్ధి ఫిట్స్ తో పడిపోయిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాధారం పదో తరగతి పరీక్షా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని రాయగూడెం గ్రామానికి చెందిన టెన్త్ విద్యార్థి బోయిన ధనుష్ పది పరీక్షలు రాసేందుకు శుక్రవారం చెరువుమాధారం పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన కొద్ది సేపటికే ఫిట్స్ రావటంతో పరీక్షా కేంద్రంలోనే పడిపోయాడు.
దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు కొద్ది సేవు ఆందోళనకు గురయ్యారు.వెంటనే ఇన్విజిలేటర్స్ అప్రమత్తమై స్థానికంగా ప్రధమ చికిత్స చేయించారు.పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో 108 ద్వారా నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వైద్యాధికారి డాక్టర్ రాజేష్ వైద్య సేవలు అందించారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు స్లున్ బాటిల్ తో విద్యార్థిని తిరిగి పరీక్ష కేంద్రంకు పంపించారు. విద్యార్థి పరీక్ష రాసిన తర్వాత తిరిగి అస్పత్రికి వచ్చి మరో మారు వైద్య పరీక్షలు చేయించారు.ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పేల్చు కున్నారు. మండల విద్యాశాఖ అధికారి బి.చలపతిరావు విద్యార్థిని పరామర్శించారు.