18-04-2025 12:00:00 AM
ఆచార్య, ఆర్ఆర్ఆర్ లాంటి క్రేజీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి ‘మధురం’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు ఉదయ్రాజ్. రాజేశ్ చికిలే దర్శకత్వం వహించారు. వైష్ణవిసింగ్ హీరోయిన్గా నటించింది. శ్రీవేంకటేశ్వర ఎంటర్టైన్ మెంట్ పతాకంపై ఎం బంగార్రాజు నిర్మించారు. ‘ఎ మెమొరబుల్ లవ్’ ట్యాగ్లైన్తో టీనేజ్ లవ్స్టోరీగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది.
ఈ సందర్భంగా హీరో ఉదయ్రాజ్ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘బంగార్రాజు సపోర్ట్తో మధురం చిత్రంలో హీరోగా చేస్తున్నా. దర్శకుడు రాజేశ్తో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. ఆయన ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యా. నైంటీస్ బ్యాక్డ్రాప్ స్టోరీ ఇది. పదోతరగతి అమ్మాయి, తొమ్మిదో తరగతి అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ చాలా అందంగా ఉంటుంది.
నేను ఇందులో మూడు డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపిస్తా. చిన్న పిల్లాడిగా, స్కూల్ స్టూడెంట్గా, మిడిల్ ఏజ్ వ్యక్తిగా మూడు గెటప్స్ వేయడానికి చాలా కష్టపడ్డా. కొన్ని సీన్లలో కొంచెం చబ్బీగా కనిపిస్తా. మళ్లీ సన్నగా అవడం కోసం ఫుడ్ తినడం మానేసి కొన్నిరోజులు నీళ్లు మాత్రమే తాగాను. డైరెక్టర్, నేను చదువుకుంది జెడ్పీహెచ్ స్కూల్లోనే కావడంతో అప్పటి విశేషాల ను గుర్తు చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించాం.
నైంటీస్లో స్కూల్స్ ఎలా ఉండేవి, అప్పటి పిల్లలు ఎలా బిహేవ్ చేశారనే వాటిపై కొంత రీసెర్చ్ చేశాం. స్కూల్కి సైకిల్ వేసుకెళ్లి.. అమ్మాయి ముందు బ్రేక్ కొట్టడం, చేతులు వదిలేసి తొక్కడం లాంటి సీన్లతోపాటు విలేజ్ నేటివిటీ, వింటేజ్ సన్నివేశాలు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి.
90ల జనరేషన్కు పాత విషయాలను గుర్తుచేసేలా సినిమా ఉంటుంది. ఇందులో కథే హీరో అని భావిస్తారు. షూటింగ్ అంతా లైవ్ లొకేషన్లో చేశాం. హీరోయిన్గా తెలుగమ్మాయి కోసం ప్రయత్నాలుచేశాం, కుదరలేదు. వైష్ణవిసింగ్ చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. హీరోనే కాకుండా ఎలాంటి పాత్రలు చేయడానికికైనా నేను సిద్ధంగా ఉంటా” అని చెప్పారు.