calender_icon.png 28 September, 2024 | 2:55 AM

ఉట్నూర్ ఏజెన్సీలో టెన్షన్ టెన్షన్...

05-09-2024 10:09:58 PM

ఏజెన్సీ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు 

ఉట్నూర్ లో అడిషనల్ డీజీ మహేష్ ఎం భగవత్ పర్యటన

కొమరంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా జైనూర్ లో నెలకొన్న ఇరువర్గాల ఘర్షణతో ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. జైనూర్ లో ఓ ఆదివాసి మహిళపై ఎస్.కే మగ్దుం అనే ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటనను నిరసిస్తూ ఆదివాసీలు చేపట్టిన ఆందోళన రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉదృతకు దారితీసింది.

దీంతో అప్రమత్తమైన ఆదిలాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉట్నూర్ ఏజెన్సీలో అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ ఎం భగవత్ పర్యటించారు. ఉట్నూర్ లోని కొమరం భీమ్ కాంప్లెక్స్ లో ఆదివాసి పెద్దలతో పాటు ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. ఆదివాసి మహిళపై  ఘటన బాధాకరమని నిందితున్ని ఇప్పటికే అరెస్టు చేయడం జరిగిందని, ఇరువర్గాల యువకులు, ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. 

అటు ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాలతో పాటు అన్ని మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉందని జిల్లా ఎస్పీ గౌష్ అలం వెల్లడించారు. ఎలాంటి అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు.