calender_icon.png 22 September, 2024 | 4:12 AM

లింగన్నపేటలో ఉద్రిక్తత

15-07-2024 02:00:52 AM

  • పురుగు మందు తాగి యువకుడి మృతి

ప్రేమించిన యువతి బంధువులు దాడి చేయడంతో మనస్తాపం ?

ఆమె ఇంటి ఎదుట మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన

రాజన్న సిరిసిల్ల, జూలై 14 (విజయక్రాం తి): ప్రేమించిన యువతి కుటుంబ సభ్యులు యువకుడిపై దాడి చేయడంతోనే అతడు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడని, మృతుడి కుటుంబ సభ్యు లు, బంధువులు యువతి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో జరిగింది. మృతుడి కుటుం బ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తుడుం శ్రీనాథ్ (24) ఇదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసి శ్రీనాథ్‌పై దాడి చేశారు.

దీంతో మనస్తాపం చెందిన శ్రీనాథ్ ఈ నెల 10న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుం సభ్యులు శ్రీనాథ్‌ను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనాథ్ శనివారం రాత్రి మృతిచెందాడు. యువకుడి మృతదేహాన్ని ఓ వాహనంలో లింగన్నపేటలోని సరాసరి యువతి ఇంటికి తీసుకువచ్చారు. ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. యువతి కుటుంబ సభ్యులు చేయిచేసుకోవడంతోనే శ్రీనాథ్ భయభ్రాంతులకు గురయ్యాడని, దీంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. శ్రీనాథ్‌పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఒక దశలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులకు సర్ది చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యుల  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.