మిషనరీపై ఆర్ఎస్ఎస్ నేత సుభాశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
పనాజీ (గోవా), అక్టోబర్ 6: బీజేపీ పాలి త రాష్ట్రం గోవాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్ఎస్ఎస్ నేత సుభాష్ వెలింగ్ కర్ క్యాథలిక్ మిషనరీ సెయింట్ ఫ్రాన్సిస్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై క్రైస్తవులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టా రు.
సుభాష్ను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఓల్డ్, దక్షిణ గోవా లో సుభాష్ వ్యాఖ్యలను ఖండిస్తూ క్రైస్తవులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. శనివారం రాత్రి మార్మగోవాలోని జాతీయ రహదారిని ఆందోళనకారులు దిగ్బంధించారు. అలాగే పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఇంకా సుభాష్ను అరెస్టు చేయలేదు.
12 కేసులు నమోదు..
ఓల్డ్గోవాలోని చర్చికి సంబంధించిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్పై సుభాస్ వెలింగ్కర్ తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై 12కు పైగా కేసులు నమోదయ్యాయి. శనివారం సాయంత్రం ఆయన స్థానిక కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. అయితే ఇప్పటివరకు సుభాష్ను అరెస్టు చేయలేదు.
గోవా పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘బీజేపీ పాలనలోని గోవాలో మత సామరస్యంపై దాడి జరుగుతోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉద్దేశపూర్వకంగా మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తిస్తు న్నారు’ అని రాహుల్ ఆరోపించారు.